సూర్యాపేట : కొవిడ్ మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు పాటించడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి జీ జగదీశ్రెడ్డి సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శనివారం సూర్యాపేటలో కలెక్టరేట్లో వైద్యాధికారులు, అనుబంధ శాఖల అధికారులతో కొవిడ్పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు.
కొవిడ్, ఒమిక్రాన్, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టి, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కొవిడ్ టీకా ఫస్ట్ డోస్ 97శాతం, రెండో డోస్ 77శాతం పూర్తయ్యిందని, 15-17 సంవత్సరాల పిల్లలకు 51శాతం మందికి టీకాలు పూర్తయ్యాయన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన 4,964 మందికి బూస్టర్ డోస్ వేసినట్లు పేర్కొన్నారు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు 650 ఉన్నాయన్నారు. ఆరు మంది మాత్రమే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీల్లో లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు, పడకలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. పేషెంట్ వేయిటింగ్ హాల్, అలాగే క్యాంటీన్ ఏర్పాటుకు కూడా అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి కోటా చలం, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శారదా, డీఐఓ వెంకటరమణ, డీపీఓ యాదయ్య, సీపీఓ సురేష్, వైద్యాధికారులు పాల్గొన్నారు.