యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 13 (నమ స్తే తెలంగాణ): ఫ్లోరోసిస్ రక్కసి నుంచి సీఎం కేసీఆరే విముక్తి కల్పించారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమం సమయంలోనే మునుగోడు ఫ్లోరోసిస్ విముక్తికి ఆయన నడుం బిగించారని గుర్తుచేశారు. మునుగోడు నుంచి ప్రారంభమైన మిషన్ భగీరథ.. ఇక్కడితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లోరోసిస్ మహమ్మారిని పారదోలిందని చెప్పారు. చండూరులో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లే దారిలో జరిగిన ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ.. ఫ్లోరోసిస్తో మునుగోడు నిర్మానుష్యం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను కాంగ్రెస్, బీజేపీ బేఖాతరు చేసిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు, చెక్ డ్యాంల నిర్మాణాలు వంటి సీఎం కేసీఆర్ నిర్ణయాలతో మునుగోడు ససశ్యామలమైందని తెలిపారు. లక్ష్మణాపురం, చర్లగూడెం, శివన్నగూడెం, డిండి-పాలమూ రు ప్రాజెక్టులపై కేసులు వేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకున్నాయని దుయ్యబట్టారు. రూ.18 వేల కోట్లు పెట్టి ప్రధాని మోదీ.. రాజగోపాల్రెడ్డిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను గుజరాత్లో కూడా అమలు చేయాలని వస్తున్న డిమాండ్లతోనే మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూసుకుంట్ల విజయమే మునుగోడు ప్రజలు కేసీఆర్కు ఇచ్చే కానుక అని చెప్పారు.
తెలంగాణ మాడల్ను దేశం మొత్తం కోరుకుంటున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభాకర్రెడ్డికి సీఎం కేసీఆర్ వీరతిలకం దిద్ది ఉప ఎన్నికకు పంపారని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్రెడ్డి పెద్ద బందిపోటు అని, ఆయన మోసపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారారని మండిపడ్డారు. బీజేపీ కరోనా కంటే ప్రమాదకరమైందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి ఎలాంటి సాయం చేయలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, మిషన్ భగీరథకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీను ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం ద్వారా తెలంగాణలో బీజేపీని శాశ్వతంగా బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని, దాన్ని గెలిపిస్తే దేశం నాశనమవుతుందని, అందుకే కమలం పార్టీని ఓడించాలని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చా రు. పచ్చని తెలంగాణలో బీజేపీ అడుగుపెడితే కార్చిచ్చు మొదలవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి, మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేయాలని కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీ ఓటు వేస్తే దేశాన్ని పూర్తిగాఅమ్మేస్తారన్నారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తున్నదని, కేంద్ర పెత్తనం పెరుగుతున్నదన్నారు. మోటర్లకు మీటర్లు పెడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలంటే రాజగోపాల్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
తాను పక్కా లోకల్ వ్యక్తిని అని, అం దుకే తనకు నియోజకవర్గంపై ప్రేమ ఉన్నదని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాజగోపాల్ నాన్ లోకల్ అని, పక్కా మోసగాడని మండిపడ్డారు. నియోజకవర్గం వ్యాప్తంగా డబుల్ రోడ్లు వేయించానని గుర్తుచేశారు. మునుగోడుకు సాగు, తాగు నీరివ్వాలని కేసీఆర్ ఉద్యమ సమయంలోనే నిర్ణయించారని, అలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తీసుకొచ్చారని చెప్పారు. శివన్నగూడెం, చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను తీసుకొచ్చానని, 2018లో ఓడిపోయినా ప్రజాసమస్యల కోసం పనిచేస్తూనే ఉన్నానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూశానన్నారు. 2018 నుంచి మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తనను గెలిపిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. రాజగోపాల్ రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ప్రజలే చెబుతున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిన రాజగోపాల్రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధం ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ను గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు.