ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అన్ని రంగాల్లోను దేశాన్ని అధోగతి పాలుచేసిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ మండలంలోని న్యూ పోచంపహాడ్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువకులు కదం తొక్కారని, ఇది మరింత విస్తరించకముందే మోదీ మేలుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే రైతు ఉద్యమాలు, అగ్నిపథ్లాంటి ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు.
ఓవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాల నియామకాలు చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ భద్రతను ఫణంగా పెట్టి అగ్నిపథ్ లాంటి పథకం తెచ్చి సైన్యంలో దొడ్డిదారిన నియామకాలకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉందని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు.. బీహార్, హర్యానా, యూపీలో జరిగిన అల్లర్ల వెనుక ఎవరున్నారో చెప్పాలని ఇంద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కారణమా? అని ప్రశ్నించారు. అభ్యర్థులు సంయమనం పాటించాలని, హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలని కోరారు.