ఆదిలాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన సాగుతుందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తుందన్నారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలుచేస్తూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కౌటాల మండలంలోని గుండాయిపేట గ్రామ సమీపంలో 75 కోట్లతో అంతరాష్ట్ర వంతెన నిర్మాణానికి విధులు మంజూరు చేశామన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించే విధంగా చింతలమాలపల్లి మండలంలో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి 57 కొట్లు మంజురు అయ్యాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.