నిర్మల్: సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దంపతులు బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. శర వేగంగా బాసర దేవాలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని భక్తుల నమ్మకం. దీంతో పెద్దఎత్తున భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు.