నిర్మల్ : భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ..సమీక్షలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మంత్రి ప్రాజెక్ట్ ను సందర్శించి.. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ లోకి 81 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, లక్ష క్యూసెక్కుల అవుట్ ప్లో, కడెం ప్రాజెక్ట్ లోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 2 లక్షల క్యూసెక్కుల అవుట్ ప్లో, స్వర్ణ ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 27 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో, గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 20,300 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వరద నీటితో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు.
వర్షాల వల్ల చెరువులు ఇప్పటికే 70 శాతానికి పైగా నిండాయన్నారు. ఆయా ప్రాజెక్ట్ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ ల పరివాహక ప్రాంత పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో వరదల సందర్భంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టడంవల్ల ఎక్కువ నష్టం జరగకుండా చూశామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ముశ్రప్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నీటిపారుద శాఖ ఈఈ రామారావు, ఇతర అధికారులు ఉన్నారు.