నిర్మల్: దళితుల అభ్యున్నతికి, దళిత మహిళలకు విద్య కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషి ఎనలేనిదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి సందర్భంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలు వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని కొనియాడారు.
కాగా, కులాంతర వివాహం చేసుకున్న మూడు కుటుంబాలకు రూ.2 లక్షల 50 వేల చొప్పున రూ.7 లక్షల 50 వేల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు, హేమంత్ బొర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.