కుమ్రం భీం ఆసిఫాబాద్ : గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. గిరిజనులకు త్వరలో పోడు పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా జైనూర్ మండలం మార్లవాయిలో నిర్వహించిన గిరిజన ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు. గుస్సాడీ (Gussadi Dance) నృత్యానికి సంబంధించిన కోచింగ్ సెంటర్ ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. గిరిజనులకు అండగా ఉండే జీవో నెంబర్ 3ను తిరిగి అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. త్వరలో జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేతుల మీదుగా గిరిజనులకు పోడు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. గిరిజన జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్లవాయిలో గిరి వికాసం ద్వారా 30 మందికి లబ్ధి చేకురుస్తున్నామని రానున్న రోజుల్లో మరింత మందికి అవకాశం కల్పిస్తామన్నారు.
గుస్సాడీ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మీ, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, నిర్మల్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి, ఎస్పీ సురేశ్ కుమార్, పద్మ అవార్డు గ్రహీత కనకరాజు, రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకయాదవరావు తదితరులు పాల్గొన్నారు.