హైదరాబాద్ : అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ 2023-24ను రూపొందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని తెలిపారు. రైతుల రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల పక్షనా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పేదలపై భారం పడకుండా పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ కోసం విద్య, వైద్యానికి నిధుల కేటాయింపులో ప్రాధన్యతనిచ్చిందని వెల్లడించారు. పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.12వేల కోట్లు కేటాయిండంతో పేదల సొంతింటి కల సంపూర్ణ సాకారం కానుందని వ్యాఖ్యనించారు.
తాను నిర్వహిస్తున్న అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో న్యాయ సేవల అభివృద్ధిలో భాగంగా కొత్త కోర్టుల భవన నిర్మాణాలకు న్యాయ శాఖకు రూ. 1050 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖకు ఈ బడ్జెట్ లో రూ. 1471 కోట్లు ప్రతిపాదించారని వెల్లడించారు. అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖకు రూ. 368 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు