నిర్మల్, అక్టోబర్ 18: ప్రజా ఆశీర్వాదంతో హ్యాట్రిక్ సాధిస్తానని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో దుర్గామాత మండపం, అంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. సొంత గ్రామం నుంచి మంత్రి ఎన్నికల శంఖారావం పూరించారు. అంతకుముందు కుమ్రంభీం, డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి సోపానాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను వివరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజల ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, బీఆర్ఎస్ మేనిపెస్టోను వివరిస్తూ ఓట్లు అడుగుతామని వివరించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. నియో జకవర్గంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతున్నదని, అభివృద్ధి ఫలాలు పొందుతున్న.. నిర్మల్ ప్రజలు మరోసారి ఆశీర్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.