హైదరాబాద్ : స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అల్లో ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందన్నారు.
రాష్ట్రంలో గ్రీనరీ 7.7శాతం పెరిగిందని, కోట్లాది మొక్కలు నాటిన ఫలితంగా పర్యావరణం పరిరక్షించబడి.. వర్షాలు సమయానుకూలంగా బాగా కురుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు రావడం.. దీన్ని అద్భుత అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కను నాటి, సంరక్షించాలని కోరారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఆయాశాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.