హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఆలయ భూములకు దేవుడి పేరిట పట్టాదార్ పాస్పుస్తకాలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ భూములకు దేవుడే యజమాని అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆలయ భూముల పరిరక్షణ కోసం వాటిని ధరణి వెబ్సైట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. శనివారం ఆయన బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆలయ భూములపై సమగ్ర నివేదిక సిద్ధంచేయాలని, వాటి పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు.
ఆలయ భూముల లీజుల వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్ఛరించారు. లీజు బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఆలయ భూముల వినియోగం, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం సుముపార్జించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సేవలకు ఉపయోగించని ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద జమచేయాలని, అధిక వడ్డీతోపాటు వాటి రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ఆదాయ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని, క్యాష్బుక్లో ఎప్పటికప్పుడు ఆదాయ, వ్యయాలను అప్డేట్ చేయాలని చెప్పారు.
అటవీ సంపదను కాపాడేందుకు చర్యలు
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడంతోపాటు అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. విధుల నిర్వహణలో భాగంగా తెలంగాణలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలర్పించారని గుర్తుచేసుకున్నారు. శనివారం ఆయన నెహ్రూ జులాజికల్ పార్క్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.