నిర్మల్ / లక్ష్మణచాంద, సెప్టెంబర్ 12: వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం లక్ష్మణచాంద మండల కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా దవాఖానాల్లో తీవ్రంగా వైద్యులు, సిబ్బంది కొరత ఉండేదని, కనీస వసతులు, మందులు కూడా అందుబాటులో ఉండేవి కావని, అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి ఉండేదన్నారు.
కానీ, తొమ్మిదేండ్లలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయన్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ఈ కేంద్రాల్లో 8 రకాల ఉచిత పరీక్షలు చేసి వైద్యం అందిస్తారని వెల్లడించారు.
ఇక్కడ పరిష్కారంకాని సమస్యలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలకు రెఫర్ చేస్తారని, అక్కడ మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్, ప్రత్యేక వార్డు ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలు వైద్య పరీక్షలు చేయించుకోలేని స్థితిలో ఉన్న మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు హరితహార కార్యక్రమంలో భాగంగా దవాఖాన ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు.