హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన ఆరోపణలపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్షా మాటల్లో ఒక్కటీ నిజం లేదని మండి పడ్డారు. బీజేపీది డబులింజన్ కాదని.. ట్రబులింజన్ అని ఎద్దేవా చేశారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ లాంటి కార్పొరేట్ల చేతుల్లో ఉందని విమర్శించారు.
అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా అడ్డగోలు మాటలు, నోటికొచ్చిన ఆరోపణలు తప్ప రాష్ర్టాభివృద్ధిపై ఆయనకు కొంచెం కూడా అవగాహన లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా, ఆదిలాబాద్లో సీసీఐ పునరుద్ధరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.