ఆసిఫాబాద్: ఈ నెల 30న జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం పర్యటన ఖరారు అయినందున సంబంధిత ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
రక్షణ చర్యలు, భోజన వసతి, ట్రాఫిక్ నియంత్రణ తదితర పూర్తిస్థాయి ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. పర్యటనను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.