నిర్మల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. నలభై ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. కానీ బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం అనే కనీస గౌరవం కూడా లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్న బండి సంజయ్ తీరుపై రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. ఆదివారం నిర్మల్లో జరిగిన బీజేపీ సభలో సీఎం కేసీఆర్తోపాటు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉన్నదా అని మంత్రి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్రలో బూతు పురాణం తప్ప ప్రజలకు పనికి వచ్చే ఒక్క విషయమైనా మాట్లాడారా? అని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రశ్నించారు.