నిర్మల్ : జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం గొడుగులు పంపిణీ చేశారు. నిర్మల్ గాంధీ పార్క్ కూరగాయల మార్కెట్లో గురువారం ఉదయం కూరగాయలు అమ్మేవారికి మంత్రి గొడుగులు అందజేశారు.
ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 గొడుగులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా నిర్మల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో రోడ్డు పక్కన, కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఉపశమనం పొందేందుకు తమ వంతుగా IKR ఫౌండేషన్ తరఫున గొడుగులు పంపిణీ చేస్తున్నామని ట్రస్ట్ కన్వీనర్ గౌతమ్ రెడ్డి తెలిపారు.
రోజంతా ఎండనక, వాననక చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలు, వృద్ధులకు నీడనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, స్థానిక కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ముత్యం రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.