హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ మాటలన్నీ కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప జవాబుదారీతనమే లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక ప్రశ్నకు జవాబు చెప్పకుండా తిరుగుముఖం పట్టారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక, బహిరంగ సభ నుంచి దేశానికి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించామని, కానీ, తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారని ప్రధాని మోదీ, బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ప్రసంగంలో చెప్పిన విషయాలను ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్రావు ఎండగట్టారు.
‘తెలంగాణకు మోదీ మొండి చెయ్యి ఇచ్చారు. గుజరాత్కు వరాలు ఇస్తారు. క్రూడాయిల్ రాయల్టీ 763 కోట్లు విడుదల చేశారు. రాజ్కోట్కు ఎయిమ్స్ ఇస్తారు. బుల్లెట్ట్రైన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు. ట్రెడిషనల్ మెడిసిన్కు సంబంధించి గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారు. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు.. ఇంకా ఎన్నో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్కు మిషన్ యూపీ కోసం రూ.55,563 కోట్లు ఇచ్చారు.
తొమ్మిది మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కాశీవిశ్వనాథ్ కారిడార్ ఇచ్చారు. కర్ణాటకకు తూముకూర్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ముంబై-బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్టైల్ మెగాక్లస్టర్ ఇలా ఎన్నో ఇచ్చారు. మరి తెలంగాణకు కూడా ఇట్లానే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ మొండి చెయ్యి ఇచ్చారు. ఒకటి కూడా ప్రజలకు పనికి వచ్చే ప్రకటన చేయలేదు’ అంటూ ధ్వజమెత్తారు.
మోదీ మస్ట్ ఆన్సర్ పేరుతో పలు ప్రశ్నలు సంధించారు..
రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెప్తున్నారు మోదీ.. మరి నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదు. దీని విలువ రూ.22 వేల కోట్లు. ఇదేనా మీ రైతు అనుకూలత మోదీ జీ..?
మోదీ జీ.. మీ ప్రసంగంలో మహిళలను మీరేదో ఉద్ధరిస్తున్నట్టు చెప్పారు. మరి పార్లమెంటులో పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎనిమిదేండ్లు అయినా ఎందుకు ఆమోదించలేదు..? దీనికి సమాధానం ఎందుకు చెప్పలేదు..? తెలంగాణలో స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధత చాటుకున్నారు.
గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని మీ కేంద్ర మంత్రులు విజయ సంకల్ప సభ వేదికగా చెప్పారు.. బాగానే ఉంది. మా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించింది. దాన్ని ఇప్పటి వరకు మీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదించ లేదు. దీనిపై కూడా మీరు వేదికపై సమాధానం చెప్తారని మా గిరిజన సోదరులు భావించారు. అంతే కాదు.. మా గిరిజన వర్సిటీకి ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వలేదు. మా సమ్మక-సారక ఉత్సవానికి నేషనల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడం లేదా..?