మంత్రి హరీశ్రావు మరోసారి తన మానత్వం చాటుకున్నారు. తాను వెళ్తున్న మార్గంలో రోడ్డు ప్రమాదం జరుగగా, కాన్వాయ్ ఆపి, క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. వైద్య సేవల కోసం వారిని దవాఖానకు పంపించారు.
వివరాల్లోకెళితే, మంత్రి హరీశ్రావు ఆదివారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్తున్నారు. తిమ్మారెడ్డిపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని చూసిన హరీశ్రావు కాన్వాయ్ ఆపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మనోధైర్యం నింపారు. అనంతరం క్షతగాత్రులను దగ్గరుండి దవాఖానకు పంపించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.