సిద్ధిపేట : దొడ్డు రకం కొనాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్లు చేయాలని, ఇలా అయినా ఆయన మారుతాడో చూద్దామంటూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి ఉన్న దొడ్డు వడ్ల కొనుగోలు కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతున్నామని, కొత్త కోరికలు కోరడం లేదన్నారు.
గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దొడ్డు రకం వడ్లు కొన్నాయని, ఇప్పుడు ఎందుకు కొనరో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బెదిరింపులకు తెలంగాణ రైతులు భయపడేవారు కాదన్నారు. రేపు ఢిల్లీలో కూడా ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేపడుతారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, యాసంగిలో వడ్లు కొనకపోతే ఇలాంటి ధర్నాలు, ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కేంద్రం చేయాల్సిన పని వడ్లు కొనాలని.. ఆ పని చేయకుండా చేతులేత్తెసిందని విమర్శించారు. బడా వ్యాపారులకు ఎన్నో కోట్ల రుణాలు మాఫీ చేసిన మీరు ఎందుకు రైతులపై చిన్న చూపు చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని, దొడ్డు రకం వడ్లు కొనేదాక పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ సోషల్ మీడియా కోసం ఓ కాలేజీని స్థాపించి.. తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. రైతులను ఉగ్రవాదులతో పోలుస్తుందని, ఒక వర్గానికి చెందిన వాళ్లను దేశభక్తులుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలు వద్దు.. దొడ్లు వడ్లు కొనాలని, గ్యాస్ ధర తగ్గించాలంటే దేశద్రోహిగా బీజేపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.