హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరునున్న అభ్యర్థులు ప్రజా సమస్యల పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. పేదల బతుకులను మార్చే గొప్ప అవకాశం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఉంటుందని అన్నారు. శనివారం హైదరాబాద్ అశోక్నగర్లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులతో మంత్రి హరీశ్రావు ముఖాముఖి నిర్వహించారు. అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ప్రజల కోణంలో ఆలోచించి సమాధానాలు చెప్పాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో నీళ్లు, నిధులు సాధించుకున్నామని, ఇక ఉద్యోగాల వంతు వచ్చిందని చెప్పారు.
విజన్ ఉంటే ఎన్నో అద్భుతాలు
విజన్ ఉంటే.. ఎన్నో అద్భుతాలు చేయొచ్చని, ఎంతోమంది బతుకులు మార్చేయొచ్చని సీఎం కేసీఆర్ నిరూపించారని హరీశ్రావు కొనియాడారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇచ్చామని, ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మిషన్ కాకతీయతో ఎన్నో చెరువులకు జీవం పోశామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశామని తెలిపారు. భూగర్భ జలాలు పెంచామని, రైతు ఆత్మహత్యలను అరికట్టామని, వ్యవసాయాన్ని పండగ చేశామని, ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించామని చెప్పారు.
నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే…
వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతా ల్లో నిధులను నేరుగా జమ చేస్తూ అవినీతిని అరికట్టామని హరీశ్రావు వివరించారు. పంట కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నామని, రైతుబంధు నిధులను పంట పెట్టుబడి సమయానికల్లా అందజేస్తున్నామని తెలిపారు. ఇలా ఎన్నో సంస్కరణలతో రైతుల బతుకులు మార్చామని వివరించారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండేదని, ఇప్పుడు సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన లక్షలాది మంది తెలంగాణకు వచ్చి ఉపాధి పొం దుతున్నారని చెప్పారు. దేశానికి ఆదాయం చేకూర్చే రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని వివరించారు.
పేదల బతుకులు మార్చే పథకాలు తేవాలి
ఐఏఎస్, ఏపీఎస్లకు పేదల బతుకులను మార్చే ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని హరీశ్రావు తెలిపారు. తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా బాల్య వివాహాలను అరికట్టామని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి మాదిరిగా దళితబంధు లాంటి పథకాలను భవిష్యత్తులో అందరికీ వర్తింపజేసేలా ఆలోచిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం వందేండ్ల భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నదేనని చెప్పారు. దేశమంతా తెలంగాణ పథకాలు కావాలని ప్రజలు కోరుతున్నారని, అందుకే.. దేశంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, ఇంటింటికీ సంక్షేమం తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలోని అనేక అత్యున్నత స్థానాల్లో తెలంగాణ అధికారులు ఉండాలని, రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత, డైరెక్టర్ విజయారాణి, బోధనా సిబ్బంది, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.