హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ చాటాలన్నారు. ప్రిలిమ్స్కు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాశీస్సులు తెలిపారు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని, తల్లి దండ్రులు, గ్రామాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
గ్రూప్-1 ప్రాథిమిక పరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. 10.15 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం 3.8 లక్ష లమంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 1019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.