సిద్దిపేట : రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసమే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం చేపట్టామని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగిందన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని ఏడేండ్లలో చేసి చూపించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని కొత్త జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజల చెంతకే పాలన తెచ్చేలా, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు కొత్త డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. ఉ. 11 గంటలకు సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సిద్దిపేట శివారులో నిర్మించిన పోలీసు కమిషనరేట్ కార్యాలయం, ఆ వెంటనే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడి కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.