సిద్దిపేట : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట పట్టణంలోని 43వ వార్డులో బాలికల హైస్కూల్లో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం ఎలా ఉందని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు మంత్రికి వివరించారు. కంటి వెలుగు శిబిరం వివరాలు, ఇప్పటి వరకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు, కండ్లద్దాలు పంపిణీ చేశారనే విషయాలను సిబ్బందిని అడిగి మంత్రి తెలుసుకున్నారు.
కండ్లద్దాలు అవసరమయ్యే వారి వివరాలను యాప్లో నమోదు చేసినట్లైయితే 15 రోజుల్లోగా లబ్ధిదారులకు అందుతాయని సూచించారు. కంటి పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానిక నిర్వాహక మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆరోగ్య మంత్రి ఆదేశించారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, వైద్య బృందం పాల్గొన్నారు.