హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎమర్జెన్సీ బ్లాక్ను సందర్శించారు. అక్కడ రోగులను మంత్రి హరీశ్రావు ఆప్యాయంగా పలుకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స ఎలా ఉంది? వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారా? వార్డులను పరిశుభ్రంగా ఉంచుతున్నారా? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఔషధాలు అందుబాటులో ఉన్నాయా? అని ఆరా తీశారు.
గాంధీ ఆస్పత్రిలో ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అని పీజీ వైద్య విద్య విద్యార్థులను హరీశ్రావు ప్రశ్నించారు. ఇక్కడ సేవలు బాగున్నాయని, చికిత్సలో వినియోగించేందుకు నెఫ్రాలజీ విభాగంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి తక్షణమే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి విలువైన వైద్య పరికరాలు సమకూర్చుతున్నదని, పేదలకు వాటి సేవలు అందేలా చూడాలన్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే రిపేర్ చేయించి, పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం అన్ని విభాగాల హెచ్వోడీలతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, అభివృద్ధి పనులు, కరోనా చికిత్స తదితర అంశాలపై చర్చించారు.