నారాయణరావుపేట: సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేటలోని బద్ధిపోచమ్మ ఆలయాన్ని అద్భుతమైన పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండల కేంద్రమైన నారాయణరావుపేట-బంజరుపల్లి గ్రామ శివారు బుగ్గారాజేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో బద్ధిపోచమ్మ విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవాలని ఎన్నో రోజుల కోరిక ఉండేదని చెప్పారు. ఆలయం మళ్లీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు.
బద్ధిపోచమ్మ దయతో జిల్లా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. ఈ మార్గంలో రోడ్డు, ఆలయ ప్రాంగణంలో వసతి కోసం మహాశివరాత్రి పండుగలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దశలవారీగా ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని వెల్లడించారు. దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆలయాభివృద్ధికి పాటుపడుతానని మంత్రి పేర్కొన్నారు.