హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పది రోజులుగా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే దవాఖానల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, దూర ప్రాంతాల నుంచి దవాఖానకు వచ్చే వారికి స్వల్ప లక్షణాలు ఉన్నా ఇన్పేషెంట్గా చేర్చుకొని చికిత్స అందించాలని సూచించారు. క్లిష్టమైన కేసులను ప్రధాన దవాఖానలకు రిఫర్ చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై మంగళవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీ, మలేరియా కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉన్నదని, చికిత్సకు అవసరమైన అన్ని మందులు దవాఖానల్లో అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. డెంగీ, మలేరియా కేసుల నిర్ధారణకు అవసరమైన ఎన్ఎస్-1 కిట్స్ 1,099, ఐజీఎం కిట్స్ 992, మలేరియా ఆర్డీటీ కిట్స్ 7.06 లక్షలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎకడా టెస్టింగ్ కిట్లు, మందుల కొరత లేకుండా చూడాలని టీఎస్ఎంఎస్ఐడీసీని ఆదేశించారు. మలేరియా, డెంగీతో ఒకరు కూడా మరణించకుండా వైద్యారోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటున్నదని తెలిపారు.
ప్రైవేట్ దవాఖానలపై కన్నేయాలి
కొన్ని ప్రైవేట్ దవాఖానలు డెంగీ చికిత్స పేరుతో ప్లేట్లేట్స్ ఎకించాలని భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని హరీశ్రావు పేర్కొన్నారు. ఇలాంటి దవాఖానలపై జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం నెలకొల్పిన వెల్నెస్ సెంటర్ల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదని, వైద్యసేవల్లో ఎటువంటి లోపం రావద్దని స్పష్టంచేశారు.
పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చూడాలని, వైద్యులు సమయ పాలన పాటించాలని సూచించారు. అన్ని వెల్నెస్ సెంటర్లను సందర్శించి, అందుతున్న వైద్యసేవలను పరిశీలించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్లు, టీచింగ్ దవాఖానలు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.