హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ వృద్ధిరేటును నమోదు చేసిందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనమండలిలో సభ్యులు కే నవీన్కుమార్, జీవన్రెడ్డి, జాఫ్రీ, నర్సిరెడ్డి తదితరులు జీఎస్డీపీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ అమలుచేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 15 శాతం పీఆర్సీ మాత్రమే ఇవ్వగా సీఎం కేసీఆర్ 30 శాతం ఇచ్చారని గుర్తుచేశారు. జీఎస్టీపై కొవిడ్ ప్రభావం ఉన్నదని వివరించారు. 2019-20లో జీఎస్డీపీ వృద్ధి 11.3 శాతం నమోదుకాగా, 2020-21లో ప్రస్తుత ధరల్లో 2.4 శాతానికి తగ్గిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో 20.5 శాతం, ఐటీ రంగంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పారు. సంపదను సమకూర్చడంలో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జీఎస్డీపీలో 11.7 శాతం పెరుగుదల నమోదైందని చెప్పారు. 2014-15లో జీఎస్డీపీ రూ. 5,05,840 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.9,80,407 కోట్లకు చేరిందని వెల్లడించారు. ఆరేండ్లలో 93.8 శాతం పెరగుదల నమోదైందని పేర్కొన్నారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని వెల్లడించారు.
కృష్ణా, గోదావరి జలాల 100% సద్వినియోగమే లక్ష్యం
గోదావరి, కృష్ణానదుల్లో కేటాయించిన నీటిని వంద శాతం వినియోగించుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, వాగులు, వంకలపై చెక్డ్యాంల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. శాసనమండలిలో సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చెక్డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరిగి, చాలా లాభాలు కలుగుతాయని చెప్పారు. చెక్డ్యాంల నిర్మాణం కొనసాగిస్తామని చెప్పారు. కొత్తగా కడుతున్న చెక్డ్యాంల ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 3.09 మీటర్ల మేర భూగర్బ జలాల మట్టం పెరిగిందని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా 10.39 లక్షల మందికి చికిత్స
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొత్తం 10,39,086 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందినట్టు మంత్రి హరీశ్రావు వివరించారు. ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం రూ.4,138 కోట్లు చెల్లించామని, ప్రస్తుతానికి రూ.160 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉన్నదని వెల్లడించారు. మండలిలో పలువుర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 87.50 లక్షల కుటుంబాలకు వైద్యసేవలు అందించే అవకాశం ఉండగా, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26.11 లక్షల కుటుంబాలకు మాత్రమే వైద్యసేవలు అందుతాయని చెప్పారు. విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ రెండింటిని కలిపి అమలుచేస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కింద 1,18,247 మందికి వైద్యసేవలు అందించగా, రూ.250.50 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. డెంగ్యూ వ్యాధికి ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స లభిస్తుందని చెప్పారు. డెంగ్యూ కేసులు 2018, 2019తో పోల్చుకొంటే తక్కువగానే ఉన్నాయని వివరించారు. నిలోఫర్, ఫీవర్ దవాఖాలను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేస్తారని హామీ ఇచ్చారు. చిన్న పిల్లల కోసం రూ.133 కోట్లతో వెంటిలెటర్స్, ఇతర పరికరాలను కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు.