సిద్దిపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం కేసీఆర్ది అభివృద్ధి వాదం. ప్రతిపక్షాలది అబద్ధ్దాల నినాదం. అబద్ధ్దాల మీద గెలిచేది నిలిచేది అభివృద్ధే. మంచి పనులే నిలబడతాయి.’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన బహిరంగసభలో హరీశ్రావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధ్దే గెలుస్తుందని చెప్పారు. ‘ఈ రోజు కేసీఆర్ అంటే ప్రజలకు ఒక నమ్మకం. రానే రాదనుకున్న తెలంగాణను తన ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చారు.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తనంటే.. ఇంత దూరం నీళ్లు వస్తాయా? ఇంత ఎత్తు ఎక్కుతాయా? మేము బతికి ఉండగా చూస్తమా? అని కొంతమంది పిచ్చి ప్రేలాపనలు మాట్లాడారు. రానే రావన్న గోదావరి జలాలు తెచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసి చూపిండు మన సీఎం కేసీఆర్’ అని వివరించారు. ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే.. కాళేశ్వరం గేట్లు ఎత్తి హల్దీ నుంచి మంజీరకు నీటిని పంపి పంటలకు ఇచ్చారని గుర్తుచేశారు. కరెంటును నిరంతరాయంగా ఇచ్చి చూపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 2018లో రైతుబంధు ప్రారంభిస్తే ఎన్నికల కోసం ఇచ్చిండని, ఎన్నికల తర్వాత బంద్ చేస్త్తడని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారని, కానీ, 11 విడతల్లో రూ.72 వేల కోట్ల నిధులు రైతుల ఖాతా ల్లో వేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పారు. రైతుబీమా, రుణమాఫీతోపాటు అనేక పథకాలు ఆమలుచేస్తున్నారని వివరించారు.
మెదక్ జిల్లా దశాబ్దాల కల
మెదక్ కేంద్రంగా జిల్లా కావాలనేది దశాబ్ద్దాల కల అని, మెదక్ను జిల్లా కేంద్రంగా మారుస్తామని, రైలు తెస్తానని ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ హామీ ఇచ్చి నెరవేర్చలేదని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. మెదక్కు రైలు తెచ్చామని, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామని, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని వివరించారు. కేసీఆర్ సీఎం కావడంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నిత్యం తిట్ల పురాణంలో పోటీ పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం పుట్లకొద్దీ వడ్లు పండించి దేశంలో తెలంగాణను నంబర్ వన్గా తీర్చిదిద్దడంలో పోటీపడుతున్నారని చెప్పారు.
నమ్మకానికి మారుపేరు కేసీఆర్
నమ్మకానికి మారుపేరు సీఎం కేసీఆర్ అయితే, ప్రతిపక్షాలది ఆమ్మకానికి మారు పేరు అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప్రతిపక్షాలు టికెట్లు, పదవులు ఆమ్ముకుంటున్నాయని ఆరోపించారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ను ఆశ్వీరదించాలని, జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.