హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ మధ్య రాష్ట్రప్రభుత్వం గురించి పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ కిషన్రెడ్డి అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ది జరగడం లేదని, ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదనేటటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారని హరీష్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన లేకనో.. లేదా రాజకీయాల కోసమో కేంద్ర మంత్రి ఈ మాటలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ స్ఫష్టం చేశారు.
రాష్ట్రానికి రావలిసిన ట్రైబల్ యూనివర్సిటీ గురించి కేంద్ర మంత్రి మాట్లాడితే బాగుంటుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యిందో ప్రజలకు చెబితే సంతోషిస్తాం. ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారో, దాన్ని పునరుద్దరణ గురించి మాట్లా సబబుగా ఉంటుందని హరీష్రావు అన్నారు. తాము దేశాన్ని వృద్ధి చేశామని మాట్లాడుతున్న కిషన్రెడ్డి ఏరంగంలో వృద్ధి చేశారో చెబితే సంతోషిస్తామన్నారు. పెట్రోల్ రేట్లను పెంచడంలో మాత్రం దేశాన్ని వృద్ధి చేశారని హరీష్ ఎద్దేవ చేశారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రికి తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని, మన తలసరి ఆదాయం 2,37,632 రూపాయలుగా ఉందని తెలిపారు. ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువని హరీష్రావు వెల్లడించారు. ఆరు సంవత్సరాల్లో దేశ తలసరి ఆదాయం 48.7 శాతం పెరిగితే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు రెట్టింపు అయిందని, ఇవన్నీ వాస్తవాలు కాదా? అని కిషన్రెడ్డిని హరీష్ ప్రశ్నించారు. మరో వైపు పన్నువసూళ్లలోనూ మనం 11.52 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు.