హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీశ్రావు బీజేపీని దుయ్యబట్టారు. గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఒక దశ దిశ ఉండేది. ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఉండేదన్నారు. దానికి తగినట్టు దేశ ప్రగతి కూడా ఉండేదన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో బడ్జెట్లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని హరీశ్రావు పేర్కొన్నారు.
మోదీ మొదటి బడ్జెట్లో చెప్పిన థీమ్ – సబ్ కా సాత్.. సబ్ కా వికాస్. కానీ ఆ ఏడాదంతా మాబ్ లించింగ్లు జరిగాయి. రెండో బడ్జెట్లో నల్లధనాన్ని అరికడుతాం అని చెప్పారు. కానీ మరుసటి సంవత్సరమే పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని గుర్తు చేశారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయని మంత్రి తెలిపారు. నల్లధనం తెచ్చి, ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ చెబితే.. ప్రజలు జన్ధన్ ఖాతాలు తెరిచి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్క పైసా డిపాజిట్ కాలేదన్నారు. మూడో బడ్జెట్లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ రైతులను పట్టించుకోకుండా, 2020లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారని తెలిపారు. 750 మంది రైతులు ఉసురు పోసుకున్నారని గుర్తు చేశారు.
ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్రావు మండిపడ్డారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. అర్హులైన వాందరికి ఇండ్లు అని ప్రకటించారు.. అది అడ్రస్ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు. నదుల అనుసంధానం కాలేదు. అంతే కాదు.. బీజేపీ విజయాలు కూడా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని హరీశ్రావు ఎద్దెవా చేశారు.
జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని హరీశ్రావు చురకలంటించారు.
ఇది కూడా చూడండి