Kethan Murder Case : పుణె (Pune) కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ (Kethan Agarwal) హత్య కేసు (Murder case) లో ప్రధాన నిందితురాలు సియా గోయల్ (Sia Goyel), మీడియా ప్రతినిధులకు అసభ్యకరంగా మధ్యవేలు చూపించిందంటూ వైరల్ అవుతున్న వీడియోపై ఆమె తండ్రి ప్రవీణ్ గోయల్ (Praveen goyel) స్పందించారు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన సైగ కాదని, కారు డోర్లో వేళ్లు నలగడంవల్ల కలిగిన నొప్పివల్ల ఆమె అలా చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.
కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్ను మార్కెట్ యార్డ్లోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నల్లటి టీ-షర్ట్ ధరించి, ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న సియా, విలేకరుల వైపు చూస్తూ తన చేతిని పైకి లేపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో నిందితురాలి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రవీణ్ గోయల్ ఒక వీడియోను విడుదల చేశారు.
సియా గోయల్ మధ్యవేలు చూపించిందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, పోలీసులు ఆమెను ఇంటికి తీసుకువచ్చిన సమయంలో కారు డోర్లో రెండు వేళ్లు నలిగి గాయపడ్డాయని ఆయన పేర్కొన్నారు. వాపుతో నీలంగా మారి కట్టు కట్టి ఉన్న ఆమె వేలిని వీడియోలో చూపిస్తూ ఈ విషయంపై అక్కడున్న పోలీసు అధికారులను అడిగి వాస్తవాలు తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కేసుకు సంబంధించి 20 ఏళ్ల సియా గోయల్తోపాటు 22 ఏళ్ల చేతన్ చౌదరిపై హత్య, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
జూన్ 18న పుణె సమీపంలోని లోహగఢ్ కోట సందర్శనకు వెళ్లిన సమయంలో సియా తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను లోయలోకి తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ విచారణలో సియా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిజాన్ని వెలికితీశారు.