హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి హరీశ్ రావు (Harish rao) అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్న రోశయ్య మృతిచెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు.
దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర శాసన సభలో 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవిలేదు, గౌరవం లేదన్నారు. ఆయన పనిచేసిన అందరు సీఎంలో మన్ననలు పొందారని చెప్పారు.
రోశయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తనను ఎంతో ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయతో కలిసి మంత్రిగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.