Minister Harish rao | జహీరాబాద్/కోహీర్, జూన్ 8: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని,కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయ న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. హోతి(కే) గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. జహీరాబాద్ పట్టణంలో ఆరె కటిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పద్మశాలీ భవనం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
అప్పట్లో మూడు రోజులకోసారి తాగునీటిని అందించేవారని తెలిపారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కష్టాలను గుర్తించి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని గుర్తుచేశారు. కర్ణాటకలోని బీదర్లో మూడు రోజులకోసారి, మహారాష్ట్రలోని షోలాపూర్లో పది రోజులకోసారి తాగునీరు లభిస్తున్నదని చెప్పారు. అనేక రాష్ర్టాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కాన్పు చేసుకోవాలంటే రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కాన్పులు చేస్తున్నామని తెలిపారు. నార్మల్ డెలివరీలు చేస్తున్నామని, కాన్పు కాగానే కేసీఆర్ కిట్ అందించి ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పారు.
గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించే పథకాన్ని ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని హరీశ్రావు వెల్లడించారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది గర్భిణులకు ఏడాదికి రెండుసార్లు కిట్లు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.