Harish Rao | సంగారెడ్డి : హైదరాబాద్ నగరం నడిబొడ్డున బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీశ్రావు శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎరోళ్ళ శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మనిషికి పని విలువ తెలిపిన మహనీయుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నారు. 12వ శతాబ్దంలోనే కులరహిత సమాజం కోసం బసవేశ్వరుడు కృషి చేశాడని కొనియాడారు. బసవేశ్వరుడు దైవస్వరూపుడు అని తెలిపారు. బసవేశ్వరుడి గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బసవేశ్వరుడి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. లింగాయత్ సమాజం ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని హరీశ్రావు స్పష్టం చేశారు. బసవేశ్వరుడి భవన్ కోసం కోకాపేట్లో రూ. 30 కోట్ల విలువైన భూమి ఇచ్చామని, దాని నిర్మాణం కోసం రూ. 10 కోట్లు కేటాయించామని తెలిపారు.
కాళేశ్వరం నుంచి సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బసవేశ్వర ప్రాజెక్టు అని పేరు పెట్టామని హరీశ్రావు తెలిపారు. లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. లింగాయత్లను కేంద్రం వెంటనే ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. కేంద్రం తరుపున కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నారు. సినిమా హీరో రజినీకాంత్ కూడా సీఎం కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నాడు. హైదరాబాద్ ఓ న్యూయార్క్లా కనిపిస్తుందని రజినీకాంత్ కొనియాడిన వ్యాఖ్యలను హరీశ్రావు గుర్తు చేశారు.