Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మిగతా 8 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తద్వారా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని పూర్తి చేయాలన్నారు.
మంత్రి హరీశ్రావు శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 8 జిల్లాల్లో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు ప్రారంభించేలా ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణ, ఇతర పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని హరీశ్రావు గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలో 21 కాలేజీలు ప్రారంభించి దేశంలోనే రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. ఆయా కాలేజీలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నడిచేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లపైన ఉందన్నారు. తరగతుల నిర్వహణ, అనుమతుల రెన్యువల్ విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు.