హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. టీ-డయాగ్నొస్టిక్స్లో (T-Diagnostics) 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ కొండాపూర్ ప్రభుత్వ దవాఖాన నుంచి వర్చువల్గా 134 వైద్య పరీక్షలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు. అన్ని పీహెచ్సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని తెలిపారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు. కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, ప్రజలను మహమ్మారిబారినుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషిచేసిన డాక్టర్లందరికీ.. వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.