హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని, త్వరలోనే నెం.1గా ఎదగాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. 60 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తొమ్మిదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిందని చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్లో బోధనా వైద్యకళాశాలల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మా తృ మరణాల రేటు తగ్గిందని తెలిపారు.
క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెండెంట్లదే పూర్తి బాధ్యత అని, 24 గంటలు సేవలు అందించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. యాంటీ ర్యాగింగ్పై కాలేజీలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ర్యాగింగ్ వంటి చర్యలను సహించేది లేదని తేల్చిచెప్పారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, అరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, అన్ని దవాఖానల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
నిమ్స్లో కొత్త భవన నిర్మాణ పనులకు బుధవారం సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో సోమవారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఇతర వైద్య, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి మంత్రి హరీశ్రావు పరిశీలించారు. భూమి పూజ అనంతరం సభ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
నిమ్స్లో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామనర్సయ్యను మంత్రి హరీశ్రావు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యమ సమయంలో పాట ద్వారా చేసిన సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామనర్సయ్య అనారోగ్యం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొన్న మంత్రి హరీశ్రావు వెంటనే ఆయనను నిమ్స్కు తరలించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన విషయం తెలిసిందే.
కోహీర్, జూన్ 12: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు బిలాల్పూర్ మనోహర్ సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఆయన హైదరాబాద్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.