సిద్దిపేట : ‘చేసింది చెపుదాం.. సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం. ప్రేమతో ప్రజలను ఓటు అడిగి మేనిఫెస్టోను’ వివరించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం స్తాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అభివృద్ధి అంటే సిద్దిపేట నేనా అన్న ప్రతిపక్షాలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. అభివృద్ధిని ఓర్వ లేని మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
సిద్దిపేటలో మనకు ఏపార్టీ తో పోటీ లేదు. మనకు మనకే పోటీ అని స్పష్టం చేశారు. మండలం మండలం పోటీ పడండి. ఎక్కువ శాతం తెచ్చుకున్న మండలానికి బహుమతి ఇస్తానని తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి నేర్చుకునేలా చేసినం. సిద్దిపేట కార్యకర్తలకు ఎమ్మెల్యే, కార్యకర్త అనుబంధం కాదు. కుటుంబ అనుబంధం మనదని పేర్కొన్నారు. ప్రభాకరన్నకు అండగా ఉందాం. దుబ్బాక గెలుపు బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఎవరికి ఆపద వచ్చినా కలిసి ఉన్నాం.
కష్టపడి అభివృద్ధి చేసుకున్నాం. సిద్దిపేట అభివృద్ధి అడ్డుకున్న వాళ్లకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లే లేదు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని డీకే శివ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడా 5 గంటల కరెంట్ ఇస్తారని హెచ్చరించారు. మీరు నేను వేరు కాదు. మీ గౌరవం పెరిగితే, నా గౌరవం పెరిగినట్టే. సిద్దిపేట అంటే ఎంతో పేరు ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు.