హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసమే రాజీనామా చేసిండని, కాంట్రాక్టుల కోసమే పార్టీ మారిండని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలతో ఢిల్లీ బీజేపీ నేతలు క్యూకడుతున్నారని, గతంలో ఏనాడైనా బీజేపీ నేతలు మునుగోడుకు వచ్చారా?.. ఇక్కడి బాధలు చూశారా? అన్నారు. 2003లోనే మర్రిగూడెంలో పర్యటించిన సందర్భంలో సీఎం కేసీఆర్ చలించిపోయారని, అధికారంలోకి రాగానే ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని, ఉద్యమంలో బీజేపీ వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ఉద్యమంలో రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ గెలిస్తే రూ.3వేల పెన్షన్ ఇస్తా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. బీజేపీకి ఓటువేస్తే రూ.1200 ఉన్న సిలిండర్ రూ.1500 చేస్తారని ఆరోపించారు. దొంగే దొంగ అన్నట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, రైతు మోటార్లకు మీటర్లు పెడతాం అంటున్న బీజేపీని తరిమికొట్టాలన్నారు. ఆ పార్టీకి ఓటువేస్తే మళ్లీ కష్టాలు వస్తాయని, మీటర్లు పెడితే రూ.30వేలకోట్లు కేంద్రం ఇస్తామన్నా.. సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టమని తేల్చి చెప్పారన్నారు. కేంద్రంతో కొట్లాడుతున్నారన్నారు.