హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశం అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కంటి వైద్యులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని కుటుంబ సంక్షేమ కమిషనర్కు ఆదేశాలిచ్చారు. తగిన పరికరాలు, సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలని, మరింత ఎక్కువ మంది పేషెంట్లకు సేవలు అందించాలన్నారు.
ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి, గుర్తించిన పేషెంట్లకు అవసరమైన చికిత్స అందించాలని చెప్పారు. క్యాంపుల నిర్వహణలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, సరోజినీ ఆసుపత్రి సూపరిటెండెంట్ రాజలింగం, డీహెచ్ శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ మోతీలాల్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.