హైదరాబాద్ : దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రపంచ, దేశవ్యాప్తంగా కరోనా, కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రభావం ఎప్పటికపుడు గమనిస్తూ ఉండాలన్నారు. రోజువారీగా పరిశీలన కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించాలని ఆదేశించారు.
కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, మూడో వేవ్ సన్నద్ధతపై మంత్రి బీఆర్కే భవన్లో మంత్రి హరీశ్రావు.. సీఎస్ సోమేశ్కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడో వేవ్ సన్నద్ధత ప్రణాళిక గురించి అధికారులు మంత్రికి వివరించారు.
థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ రూపంలో మూడో వేవ్ ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ క్రమంలో 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని సూచించారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27, 996 పడకలకుగాను 25, 826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తి అయ్యిందని, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో మందుల నిల్వలను నిర్వహించాలని ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వాలకు తోడుగా ప్రజలు సైతం తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచడం జరిగిందన్నారు. రెండో డోస్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పక్కగా పాటించాలని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పక పాటించాలని కోరారు.