హైదరాబాద్ : కొవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం ఆయన హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావులతో కలిసి అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్వోలు, టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్గా తేలిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని ఆదేశించారు.
ఈ మేరకు ప్రతీ ప్రభుత్వ దవాఖానలో ఒక ఆపరేషన్ థియేటర్, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా.. అనవసరంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్దాసుపత్రులకు రిఫర్ చేయొద్దని సూచించారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని కొవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించొద్దని, వారి కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డును ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని ఆసుపత్రులకు అసవరమైన వైద్య పరికరాలను అందించడం జరిగిందని, అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాలన్నారు.
కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలని మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్, పరీక్షలు, హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ జరగాలన్నారు. లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్ ఇచ్చి పంపాలన్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ పీహెచ్సీలో రాత్రి పదింటి వరకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలన్నారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలన్నారు.