హైదరాబాద్ : తల్లీబిడ్డా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా అత్యాధునిక యంత్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 56 టిఫా యంత్రాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు 26 ఆప్తల్మిక్ ఎక్విప్మెంట్ సైతం ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఎంసీఆర్ హెచ్డీలో సోమవారం టీఎస్ ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి నెలవారీ సమీక్షను సోమవారం నిర్వహించారు.
కొత్త ఏర్పాటు చేస్తున్న టిఫా యంత్రాలతో గర్భిణులు టెస్టుల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. టీ డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా థైరాయిడ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక గర్భిణులు టెస్టుల కోసం బయటికి వెళ్లే అవసరం ఉండబోదన్నారు. ఈ సందర్భంగా సివిల్, ఎక్విప్మెంట్, ఈ – ఉపకరణ్, డ్రగ్స్, సర్జికల్, డయాగ్నొస్టిక్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై చర్చించారు. గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
టీవీవీపీ పరిధిలోని 32 ఆసుపత్రుల అప్గ్రేడేషన్ పనులు, 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ పనులు వేగవంతం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 41 బస్తీ దవాఖానలు 31 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానల పనులు వేగవంతం చేయాలన్నారు. డీఎంహెచ్ఓలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకొని పని చేయాలన్నారు.
ఎప్పటికపుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలన్నారు. జీవన్దాన్ ద్వారా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు, బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో టీఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని జిల్లాల డీ ఎంహెచ్ వోలు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.