సిద్దిపేట : సిద్దిపేట జిల్లా రైతులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు శుభవార్త చెప్పారు. బ్యాంకుల ద్వారా సులభతరంగా రుణాలు పొందేందుకు, అలాగే రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులు రుణ విముక్తి నుంచి ఉపశమనం పొందేందుకు వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఇది సువర్ణావకాశమని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హరీశ్రావు పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం బ్యాంకర్లతో హరీశ్రావు సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమీక్షలో బ్యాంకు రుణ విముక్తికై వన్ టైమ్ సెటిల్మెంట్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంత రైతుల వ్యవసాయ రుణాలకు సంబంధించి అన్నీ బ్యాంకులు తప్పనిసరిగా రెన్యూవల్ చేయాలని బ్యాంకర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన రైతుల భూములకు సంబంధించి, వారి రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేక పథకాలు రూపొందించి వారికి రుణ విముక్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ, టీజీబీ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు రుణ విముక్తి కలగనుందని హరీశ్రావు స్పష్టం చేశారు. వివిధ బ్యాంకుల నుంచి ఓటీఎస్ స్కీమ్ కింద 12 శాతం నుంచి 50 శాతం వరకు మొండి బకాయిలు ఉండి, క్రాప్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేక పోయిన వారికి నాలుగు బ్యాంకుల నుంచి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకునే వెసులుబాటు కలగనుందని తెలిపారు.
ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఏఈఓలు, పంచాయతీ అధికారులు, ఏంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఏంపీఓ, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు మేలు కలిగేలా చొరవ చూపాలని మంత్రి సూచించారు.
గతంలో ఫిషరీస్ కింద రుణాలు దరఖాస్తు చేసుకున్న వారిని తొందరగా గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. డైరీ మెయింటెనెన్స్ కింద పశువులకు దాణా తదితర వాటికి డైరీ పెంపొందించేలా రుణాలు త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్ రావు సూచించారు.
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్,
ఆర్ బీఐ ఏజీఏం శివరామన్, నాబార్డు డీడీఏం తేజన్, యూనియన్ బ్యాంకు డీజీఏం సత్యం, ఏపీజీవీబీ ఆర్ఏం ఆశాలత, కెనరా బ్యాంకు మాధవి, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.