హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ డెంగీ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యారోగ్య, మున్సిపల్ శాఖలతో కలిసి డెంగీ నివారణకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో డెంగీపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో జ్వర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో బూస్టర్ డోస్ విరివిగా వేసే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డెంగీ నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రతి ఐదేండ్లకు ఒకసారి డెంగీ కేసులు పెరుగుతుంటాయని తెలిపారు. ఇది ఐదో ఏడాది కాబట్టి.. కేసుల తీవ్రతను గమనిస్తున్నాం. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గ్రేటర్ పరిధిలో జులై నెలలో 542 డెంగీ కేసులు నమోదైతే.. ఆగస్టులో ఆ సంఖ్య 1827కి చేరిందన్నారు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు లేకుండా చూసుకోవాలన్నారు. తొట్టిలు, కొబ్బరిచిప్పలు, పాత టైర్లను దూరంగా ఉండేలా చూసుకోవాలని మంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 1600 మంది ఎంటమాలజిస్ట్లో బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, అవసరమైన వారికి ఎంత రక్తాన్నైనా ఉచితంగా ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దోమల నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
డెంగీ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని హరీశ్రావు సూచించారు. టీ డయాగ్నసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెంద వద్దు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బాధితులు బస్తీ దవాఖానాకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.