హైదరాబాద్ : ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ అధికారులు, ఇంజినీర్లతో ఆదివారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి హరీశ్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ల పునరుద్ధరణ, కొనసాగుతున్న పనులు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ‘మన ఊరు – మన బడి’, హెల్త్ సబ్ సెంటర్లు, ఉపాధిహామీ, గ్రామీణ సడక్ యోజన తదితర అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల పునరుద్ధరణ పనుల కోసం రూ.401 కోట్లు మంజూరు చేశారని, ఇందులో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.321కోట్లు, పీఆర్ ఎంఆర్ఆర్ ద్వారా రూ.80కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ పరిధిలోని 13 నియోజకవర్గాల్లో 454 పనులకు శ్రీకారం చుట్టి.. 1,494 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్లు ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు అంతా రుణపడి ఉండాలన్నారు.

ఎస్డీఎఫ్ రోడ్ల మరమ్మతు పనులు నియోజకవర్గాల వారీగా, ప్యాకేజీ వారీగా పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పనులు నాణ్యంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కష్టపడి పని చేయాలని, ప్రజల మనసు గెలవాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
బీటీ రెన్యువల్ సమయంలో అవసరం ఉన్న చోట్ల సీసీరోడ్లు వేయాలని, మన ఊరు – మన బడి పథకం పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాకలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఎంపీలు ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్కుమార్, మాణిక్ రావు, భూపాల్ రెడ్డి, మధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ శివకుమార్, దేవేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ జోగారెడ్డి, ఈఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు.