హైదరాబాద్ : కన్న తల్లి కంటే ముందు మనకు కదలిక నేర్పించేది.. స్పర్శించేది నర్సేనని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గాంధీ దవాఖానలో అంతర్జాతీయ నర్స్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలను అందించిన నర్సులకు అవార్డులను అందించి, అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో డాక్టర్లకు, నర్సులకు చాలా గౌరవం ఉందని, కరోనా సమయంలో నిరూపితమైందన్నారు.
కన్నవారు, కట్టుకున్న వాళ్లు వదిలి వెళ్లినా నర్సులు ఎంతో సేవ చేశారన్నారు. కొంత మంది నర్సులు మరణించినా.. అధైర్యపడకుండా స్టాఫ్నర్సులు సేవలందించారన్నారు. స్టాఫ్నర్సుల స్పర్శ తల్లిలాంటిదని, పిల్లలకు తొలి స్పర్శ కన్నా ముందు నర్స్కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నర్సింగ్ స్టూడెంట్స్కు స్టయిఫండ్ పెంచినట్లు తెలిపారు. నర్సింగ్ విద్య ప్రాధాన్యం, మహిళలకు ఉన్న అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వైద్యవిద్యతో పాటు నర్సింగ్ విద్యను పటిష్టం చేయాలని నిర్ణయించారన్నారు.
జిల్లాకో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నర్సింగ్ కాలేజీలు ఆరు ఉంటే.. ఇప్పుడు 33 కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నర్సింగ్లో కూడా అనేక మార్పులు వచ్చాయనీ, ఎన్హెచ్ఎం నుంచి కొంత మంది నర్సులకు ఎస్సీయూలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇంతకు ముందు ప్రమోషన్లో ఆలస్యమయ్యేదే కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.
4,722 స్టాఫ్ నర్స్ల నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 24 గంటలు పేషెంట్ను కంటికి రెప్పలా కాపాడుకునే వారు నర్సులు తల్లిదండ్రిగా మీరు సేవలు చేస్తున్నారని, ఇదో గొప్ప వృత్తనీ, ఒకరిద్దరి వల్ల వృత్తికి చెడ్డపేరు వస్తుందని, ఇకపై అలా జరుగకుండా చూసుకోవాలన్నారు. నర్సింగ్ కౌన్సిల్ను బలోపేతం చేస్తామని, నర్సింగ్ డైరెక్టరేట్ గురించి సీఎం కేసీఆర్ పాజిటివ్గా ఉన్నట్లు వివరించారు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు.