సిద్దిపేట : వైద్యులది ఉద్యోగం కాదు వృత్తి.. వైద్యం చేసి ప్రాణాలు కాపాడే మీరు దైవంతో సమానం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వృత్తికి పని వేళలు ఉండవు. వైద్య వృత్తిని ఎంచుకున్నప్పుడే మీ సేవాభావం ప్రజలతో ముడిపడి ఉంటుందన్నారు. అన్నింటికీ దూరంగా ఉంటూ సేవ చేయడమే మీ వృత్తి ధర్మం అని మంత్రి చెప్పారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12,700 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 1326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా 100 శాతం ఖాళీలన్ని భర్తీ చేస్తామన్నారు.
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ డాక్టర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. డాక్టర్. బీసీ రాయ్ గొప్ప వైద్యులే కాకుండా, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి గా ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలను చైతన్యపరిచి భరోసా కల్పించడంలో వైద్యులు, జర్నలిస్ట్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి సేవ వెలకట్టలేనిదని హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు నమ్మకంతో సర్కార్ దవాఖానకు వచ్చేలా చేసే బాధ్యత మీది అని వైద్యులకు హరీశ్రావు సూచించారు. మీరు, నేను కలిసి కష్ట పడితే వైద్య రంగంలో రాష్టాన్ని దేశంలో అగ్ర భాగాన నిలుపుతామన్నారు. ప్రయివేటు దవఖానాలకు ధీటుగా ప్రభుత్వ దవఖానాలను అభివృద్ధి చేస్తున్నాము. 36 శాతం మంది ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. పల్లె, బస్తీ దవఖానాల్లో వసతులు పెంచామని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేలా నమ్మకం కలిగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయడానికి డాక్టర్లు ముందుకు రావాలని హరీశ్రావు కోరారు.