హనుమకొండ : తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. విద్యతో పాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పల్లె ప్రజల కోసం పల్లె దవాఖానలు, పట్టణ ప్రజల కోసం బస్తీ దవాఖానలు, జిల్లాకొక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలువైపులా ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. 8 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి అని మంత్రి హరీశ్రావు తెలిపారు.
హనుమకొండలో టీ డయాగ్నోస్టిక్ హబ్తో పాటు రేడియాలజీ ల్యాబ్కు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. మదర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజీ యూనిట్, ఎంజీఎం ఆస్పత్రిలో 42పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మేల్యేలు నరేందర్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. మంత్రుల కోరిక మేరకు సమ్మక్క సారక్క జాతరలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య శాఖ తరపున పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమ్మక్క జాతర తర్వాత ములుగు, సిరిసిల్లలో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు మొదలవుతుంది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్టిన పిల్లల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, పెద్ద వాళ్ల కోసం అడల్ట్ ఐసీయూ, తల్లుల కోసం మెటర్నల్ ఐసీయూలను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా చిన్నారుల కోసం పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లను మొదటి సారిగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి చెప్పారు.
మదర్ మిల్క్ బ్యాంక్ను హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్లో ప్రారంభించుకున్నామని తెలిపారు. 36 శాతం మంది పిల్లలు మాత్రమే మొదటి గంటలో పాలు తాగుతున్నారు. ఈ పాలు అమృతం లాంటివి అని పేర్కొన్నారు. తల్లులకు సీజేరియన్లు, ఇతర కారణాల వల్ల చాలా మంది పిల్లలు ఈ పాలకు దూరమవుతున్నారు. ఇటువంటి సమయంలో శిశువుల ఆకలి తీర్చడానికి ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న మిల్క్ బ్యాంక్ అద్భుతమైన సేవలందిస్తున్నది. హైదరాబాద్ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
హనుమకొండ జిల్లాలో టీ డయాగ్నోస్టిక్, రేడియాలజీ ల్యాబ్కు శంకుస్థాపన చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ. 3 కోట్ల 50 లక్షలతో వచ్చే నాలుగు నెలల్లోనే ఈ రెండింటిని అందుబాటులోకి తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 33 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్, రేడియాలజీ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 20 జిల్లాల్లో పూర్తి చేసుకుని, ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.
నర్సంపేట్ 200, భూపాలపల్లి 300, ములుగు 200, మహబూబాబాద్ 200 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దీనికి తోడు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 2,900 పడకలు అందుబాటులోకి రానున్నాయి అని మంత్రి పేర్కొన్నారు.